1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను నరమేధంగా గుర్తించాలంటూ... కాలిఫోర్నియా అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం

1984లో భారత్‌లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై కాలిఫోర్నియా అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. ఆ అల్లర్ల కారణంగా అనుభవించిన మానసిక క్షోభ, శారీరక గాయాల నుంచి సిక్కు వర్గాలు ఇప్పటికీ తేరుకోలేదని, కాబట్టి నాటి అల్లర్లను అమెరికా కాంగ్రెస్ నరమేధంగా గుర్తించి ఖండించాలని అభ్యర్థిస్తూ తీర్మానించింది.

కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికైన తొలి సిక్కు మహిళ జస్మీత్ కౌర్ బయాన్స్ మార్చి 22న ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరో సభ్యుడు కార్లోస్ విల్లాపుడా దీనిని బలపర్చారు. సభలో ఉన్న హిందూ సభ్యుడు యాష్ కార్లా కూడా దీనికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.

1984 అల్లర్లలో ఢిల్లీలో బాధిత ప్రాంతమైన ఓ కాలనీ గురించి కూడా ఈ తీర్మానంలో ప్రస్తావించారు. 2015లోనూ ఈ అసెంబ్లీ సిక్కు వ్యతిరేక అల్లర్లను హత్యాకాండగా అభివర్ణిస్తూ తీర్మానం చేసిన విషయాన్ని అమెరికన్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు ప్రీత్‌పాల్ సింగ్ గుర్తు చేశారు. కాగా, గతేడాది జనవరి 6న న్యూజెర్సీ సెనేట్ కూడా ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించింది.

California
California Assembly
US Congress
1984 Anti-Sikh Riots
Genocide

More Telugu News