కేంద్రం చేతిలో పావులుగా వ్యవహరిస్తున్నారు.. గవర్నర్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్

  • గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న ట్వీట్ ను రీట్వీట్ చేసిన మంత్రి
  • అత్యున్నత పదవిలో ఉన్నవారు రాజకీయ పావులుగా మారడం విచారకరమని వ్యాఖ్య
  • బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపట్ల కేంద్రం తీరును తప్పుబట్టిన కేటీఆర్
అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వారు కేంద్ర ప్రభుత్వ చేతిలో రాజకీయ పావులుగా మారడం విచారకరమని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ చేసిన ట్వీట్ ను మంత్రి రీట్వీట్ చేశారు. ఇందులో తన అభిప్రాయాన్ని కూడా మంత్రి జోడించారు.

బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలతో ఒకలా.. నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలతో మరొకలా కేంద్రం ప్రవర్తిస్తోందని కొణతం దిలీప్ ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇందుకోసం గవర్నర్లు తమ అధికారాలను నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. బ్రిటీషర్ల కాలం నాటి వలస వాద గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన టైమొచ్చిందని తెలిపారు. ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్ లో పెట్టకుండా ఉండేందుకు తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సమర్థించారు.

కొణతం దిలీప్ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్లు రాజకీయ పావులుగా మారడం బాధాకరమన్నారు. నాన్ బీజేపీ రాష్ట్రాలలో ప్రభుత్వాలకు గవర్నర్లు సహకరించకపోగా ఇబ్బందులకు గురిచేయడానికి ప్రతీకారంతో వ్యవహరించడం కనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి వైఖరి సహకార సమాఖ్య పాలనకు మోడలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Telangana
KTR
union govt
Governors
Twitter

More Telugu News