పేపర్ లీకేజీపై హైకోర్టులో కీలక విచారణ.. హాజరైన రేవంత్ రెడ్డి

Key hearing on paper leakage in High Court
  • కేసును సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిటిషన్
  • పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ వివేక్ తన్కా
  • కేసులో ఇద్దరికే సంబంధం ఉందని మంత్రి కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్న
తెలంగాణలో సంచలనం రేకెత్తించిన టీఎస్ పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు హైకోర్టుకు హాజరయ్యారు. పేపర్ లీక్ కేసుపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది వివేక్ తన్కా వాదనలను వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందని మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. గతంలో వ్యాపం కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ఉదహరించారు. ఈ క్రమంలో రేవంత్ హైకోర్టుకు హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్, ఆయన పీఏకు సంబంధం ఉందని చేసిన ఆరోపణలపై ఆధారాలు కోరుతూ సిట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు లీకేజీ కేసులో అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను సిట్ నాలుగో రోజు కూడా విచారిస్తోంది. ప్రధానంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ను ఇంకెవరెవరికి చేరవేశారనే విషయాలను ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రధాన నిందితులు ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది.
Go Back to Shorts
Revanth Reddy
High Court
TSPSC
Paper leak
KTR

More Telugu News