RS Praveen Kumar: గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీకేజ్ వెనుక కల్వకుంట్ల కవిత ఉన్నారు... నా దగ్గర ఆధారాలు ఉన్నాయి: ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ

RS Praveen Kumar Shocking Comments On Kavitha Over TSPSC Paper Leak Issue
  • పేపర్ లీకేజ్ వ్యవహారంలో కవిత, హరీశ్ రావుల హస్తం ఉందన్న ప్రవీణ్ కుమార్
  • ఆధారాలను సరైన సమయంలో హైకోర్టుకు లేదా సీబీఐకి ఇస్తానని వ్యాఖ్య
  • టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెందిన కాన్ఫిడెన్సియల్ సెక్షన్ లో ఉన్నారని... వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లను కవితకు అందజేశారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని... సరైన సమయంలో వాటిని హైకోర్టుకు కానీ, సీబీఐకి కానీ అప్పగిస్తానని తెలిపారు.

టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ బి. జనార్దన్ రెడ్డి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని చెప్పారు. సిట్ నుంచి డీజీపీ, చీఫ్ సెక్రటరీకి అందే నివేదికలు చివరకు ముఖ్యమంత్రి చేతికి చేరుతాయని.... బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఏమాత్రం లేదని అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని... తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి ఆర్టికల్ 317 కింద టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని డిస్మిస్ చేయాలని కోరారు.

More Telugu News

RS Praveen Kumar
TSPSC
Paper Leak
K Kavitha
Harish Rao
BRS