Thailand: థాయ్ లాండ్ ను కమ్మేసిన కాలుష్యం.. వారంలోనే ఆసుపత్రి పాలైన 2 లక్షల మంది

  • కొత్త ఏడాది మొదలైన నాటి నుంచి 13 లక్షల మందికి అనారోగ్యం
  • గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయిందన్న అధికారులు
  • ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ పిల్లలు, గర్భిణీలకు సూచన
2 Lakh People Hospitalised In Thailand due to Air pollution

థాయ్ లాండ్ లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. దీని ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 13 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. గడిచిన వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 2 లక్షల మంది ఆసుపత్రులలో చేరారని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పర్యాటక కేంద్రం బ్యాంకాక్ సిటీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయిందని హెచ్చరించారు.

సిటీని కాలుష్యం కమ్మేసిందని, వాహనాలు, ఫ్యాక్టరీలు వెలువరించే కాలుష్యంతో పాటు వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత వల్ల ఎయిర్ క్వాలిటీ పడిపోతోందని చెప్పారు. గాలి నాణ్యత మెరుగుపడే వరకు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని, పిల్లలు, గర్భిణీలు ఇంటికే పరిమితం కావాలని థాయ్ లాండ్ మంత్రి క్రియాంగ్ క్రాయ్ పేర్కొన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మంచి నాణ్యతకల ఎన్-95 మాస్క్ ను తప్పకుండా ధరించాలని హితవు పలికారు. ఇక స్కూళ్లు, పార్క్ లలో ‘నో డస్ట్ రూమ్’ పేరుతో ఎయిర్ ఫ్యూరిఫయర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బ్యాంకాక్ మూడో స్థానంలో ఉంది.

More Telugu News