E- Rickshaw Blows Up: బాణసంచా తీసుకెళ్తుండగా పేలిన ఈ-రిక్షా .. ఒకరి మృతి.. వీడియో వైరల్!

  • గ్రేటర్ నోయిడాలో జగన్నాథ యాత్రలో పటాసులు కాల్చిన నిర్వాహకులు
  • బాణసంచా నింపిన ఈ-రిక్షాపై ఎగిరిపడ్డ క్రాకర్స్
  • బాంబులా పేలిన రిక్షా.. కమ్మేసిన పొగ
E Rickshaw Blows Up During Firecracker Drop In Noida

బాణసంచా తీసుకెళ్తున్న ఈ-రిక్షా పేలడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రేటర్ నోయిడాలో జరిగిందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నోయిడాలోని దాద్రీలో రిక్షా నడిపే పప్పు, అతని సహాయకుడు సల్మాన్.. బాణసంచా నింపిన ఈ-రిక్షాను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికంగా జరిగే జగన్నాథ యాత్రలో కొందరు పటాసులు కాల్చారు. ఆ సమయంలో కొన్ని ఎగిరివచ్చి ఈ-రిక్షాలోని పటాసులపై పడ్డాయి. దాంతో ఒక్కసారిగా రిక్షా పేలిపోయింది. ఎలక్ట్రిక్ వాహనం కావడం, క్రాకర్లు ఎక్కువగా ఉండటంతో బాంబు పేలినట్లుగా కనిపించింది. 

ఈ ఘటనలో పప్పు, సల్మాన్ తీవ్ర గాయపడ్డారని, వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు సల్మాన్ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన అంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఏమైందో తెలియక చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. పేలుడుకు ముందు రిక్షాలో ఇద్దరు ఉండటం కనిపించింది. పటాసులన్నీ పక్క దుకాణాలపై చెల్లాచెదరుగా పడ్డాయి.

More Telugu News