water crisis: దక్షిణాది రాష్ట్రాల్లో నీటికి కటకట.. రిజర్వాయర్లలో పడిపోయిన నిల్వలు!

  • జలాశయాల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయిన నిల్వలు
  • 42 రిజర్వాయర్లలో వాస్తవ నిల్వ సామర్థ్యం 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్లు
  • ప్రస్తుతం వాటిలో 8.865 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే నీరు
  • ఇది మొత్తం నిల్వ సామర్థ్యంలో కేవలం 17 శాతమే
  • తాజా బులెటిన్ లో కేంద్ర జల సంఘం వెల్లడి
South India Stares At Severe Water Crisis As Reservoir Levels Plunge To Mere 17 percent

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో కూడిన దక్షిణాది రాష్ట్రాలను నీటి కష్టాలు వెక్కిరిస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రిజర్వాయర్లలో నీటిమట్టాలు పడిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ లో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దక్షిణాదిలో మొత్తం 42 రిజర్వాయర్లు సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉండగా వాటి వాస్తవ నిల్వ సామర్థ్యం 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్లు. కానీ ప్రస్తుతం ఆ రిజర్వాయర్లలో 8.865 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. అంటే మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది కేవలం 17 శాతమే.

గతేడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 29 శాతం నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు 23 శాతంగా నమోదైంది. ఈ లెక్కన గత పదేళ్లకన్నా దారుణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోయాయి. నీటి నిల్వలు తగ్గడం దక్షిణాది రాష్ట్రాల్లో తాగునీరు, సాగునీరు సరఫరాకు సవాల్ విసురుతోంది. అలాగే జల విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతోంది.

దేశంలోని తూర్పు ప్రాంతంలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు గతేడాది, గత పదేళ్ల సగటుతో పోలిస్తే పెరిగాయి. ఈ ప్రాంతంలో 23 రిజర్వాయర్లు సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్నాయి. వాటి వాస్తవ నిల్వ సామర్థ్యం 20.43‌‌‌‌0 బిలియన్ క్యూబిక్ మీటర్లుకాగా ప్రస్తుతం వాటిలో 7.889 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేర నీరు ఉంది. అంటే రిజర్వాయర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 39 శాతం. గతేడాది ఇదే సమాయానికి ఈ రాష్ట్రాల్లో 34 శాతం నీరు నిల్వ ఉండగా ఈసారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉంది. అలాగే గత పదేళ్ల సగటు 34 శాతంకన్నా అక్కడ నీటి నిల్వలు అధికంగానే ఉన్నాయి.

ఇక దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలతో కూడిన పశ్చిమ ప్రాంతంలో 49 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటిలో 11.771 బీసీఎం మేర నీరు నిల్వ ఉంది. ఇది వాటి వాస్తవ నిల్వ సామర్థ్యంలో 31.7 శాతం. అయితే ఇది గతేడాది ఉన్న 38 శాతం, గత పదేళ్ల సగటు 32.1 శాతంకన్నా తక్కువ. 

దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లోనూ నీటి నిల్వలు తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. నీటి నిల్వల ఆధారంగా వివిధ నదీ బేసిన్ ల పరిధిలో నీటి నిల్వలను మూడు రకాలుగా సీడబ్ల్యూసీ విభజించింది. సాధారణంకన్నా ఎక్కువ, సాధారణానికి చేరువగా, లోటు లేదా తీవ్ర లోటుగా వర్గీకరించింది.

బ్రహ్మపుత్ర, నర్మద, తాపీ నదీ బేసిన్ ల పరిధిలోని రిజర్వాయర్లలో సాధారణంకంటే ఎక్కువ నీటి నిల్వలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. అలాగే కావేరీ, మహానది, పెన్నా బేసిన్ ల పరిధిలో తీవ్ర లోటు కనిపిస్తోందని పేర్కొంది.

More Telugu News