భారత్‌లో మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. గాయం కారణంగా ఇప్పటికే డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్‌వుడ్ జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు అగర్ కూడా దూరమయ్యాడు. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో ఆ జట్టుకు భారీ దెబ్బేనని చెబుతున్నారు. 

స్వదేశంలో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఆడేందుకే అగర్ స్వదేశానికి వెళ్లినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. కాగా, భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అగర్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలుత జట్టులో లేనప్పటికీ ఆ తర్వాత టాడ్ మర్ఫీ, మట్ కుహ్నేమన్‌లను ఆ మ్యాచుల్లో ఆడించింది.   

స్వదేశానికి వెళ్లిన అగర్ వచ్చే వారం షీల్డ్ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో టాస్మేనియాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాగా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికే స్వదేశానికి వెళ్లాడు. మార్చి 1న ఇండోర్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టు సమయానికి అతడు అందుబాటులోకి వస్తాడనే భావిస్తున్నారు.

Ashton Agar
Australia
Team India
David Warner
Josh Hazlewood
Pat Cummins

More Telugu News