Lithium: దేశంలో తొలిసారి లిథియం నిల్వల గుర్తింపు... జమ్మూకశ్మీర్ లో భారీగా లిథియం

Lithium reserved found in India for first time
  • జమ్మూకశ్మీర్ లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు 
  • అధికారికంగా ప్రకటించిన కేంద్ర గనుల శాఖ
  • ఈవీ బ్యాటరీల్లో ఉపయోగించేది లిథియంనే
మన దేశంలో తొలిసారి లిథియం నిల్వలను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. భారీ మొత్తంలో లిథియం నిల్వలను కనుగొంది. జమ్మూకశ్మీర్ లో ఏకంగా 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్స్ ను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నాన్ ఫెర్రస్ మెటల్ అయిన లిథియంను ఈవీ బ్యాటరీల్లో వాడతారు. భవిష్యత్తు అంతా ఎలెక్ట్రిక్ వాహనాలదే కానున్న తరుణంలో మన దేశంలో పెద్ద మొత్తంలో లిథియం నిల్వలు బయటపడటం... ఈ రంగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సహకరించబోతోంది. 

జమ్మూకశ్మీర్ లోని రేసి జిల్లా సలాల్ హైమానా ప్రాంతంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిథియం నిల్వలను గుర్తించిందని కేంద్ర గనుల శాఖ తెలిపింది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన 51 మినరల్ బ్లాక్ లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పామని వెల్లడించింది. ఈ 51 బ్లాకుల్లో 5 గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయని... మిగిలిన వాటిలో పొటాష్, మాలిబ్డినం, ఇతర బేస్ మెటల్స్ ఉన్నాయని తెలిపింది. జమ్మూకశ్శీర్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బ్లాకులు ఉన్నాయని చెప్పింది.

More Telugu News

Lithium
Jammu And Kashmir