Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండో చార్జ్ షీట్.. కేజ్రీవాల్, మాగుంట, కవిత పేర్ల ప్రస్తావన

names of kejriwal and kavitha in ed charge sheet
  • సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో 17 మందిపై అభియోగాలను మోపిన ఈడీ
  • సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి జాబితాలో ఎమ్మెల్సీ కవిత పేరు
  • కవిత 10 ఫోన్లు మార్చినట్లు ఈడీ వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండో చార్జ్ షీట్ ను ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. ఇందులో మొత్తం 17 మందిపై అభియోగాలు మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను నమోదు చేసింది. 

అలాగే అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బినయ్ బాబులతోపాటు కావోగాలి రెస్టారెంట్, ట్రైడెంట్ లిమిటెడ్, పెరమండ్ రిసార్ట్, పాపులర్ స్పిరిట్, అవంతికా కాంట్రాక్టర్స్, కేఎస్ జయం స్పిరిట్, బడ్డీ రిటైల్స్, స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్, ఆర్మో మిక్స్ ఎకో సిస్టమ్ ల పేర్లను ప్రస్తావించింది. 

ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఢిల్లీ సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తూ, కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసింది. 

లిక్కర్ స్కామ్ లో భాగంగా విచారించిన వారి జాబితాలో కవిత పేరును ఈడీ చేర్చింది. అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి లిస్టులోనూ ఆమె పేరును ప్రస్తావించింది. కవిత 10 ఫోన్లు మార్చినట్లు పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు చార్జ్ షీట్ లో ఈడీ ప్రస్తావించింది. అభిషేక్ నుంచి రూ.30 కోట్లు విజయ్ నాయర్ కు బదిలీ చేసినట్లు తెలిపింది. 

More Telugu News

Arvind Kejriwal
mlc kavitha
Magunta Sreenivasulu Reddy
Delhi Liquor Scam
Enforcement Directorate