యూపీఐ ద్వారా రోజుకు ఎంత నగదు బదిలీ చేసుకోవచ్చు?
- రోజుకు యూపీఐ నగదు బదిలీ పరిమితి రూ.లక్ష
- ఒకే లావాదేవీ కింద రూ.లక్ష పంపుకోవడానికి అవకాశం
- బ్యాంకుల వారీగా విడిగా ఒక్కో లావాదేవీపై పరిమితులు
పేటీఎం
పేటీఎం నుంచి ఒక యూజర్ ఒక రోజులో రూ.లక్షను బదిలీ చేసుకోవచ్చు. అయితే ఒక గంటకు రూ.20,000 వరకు లావాదేవీలనే అనుమతిస్తోంది. ఒక గంటలో ఐదు లావాదేవీలే చేసుకోగలరు. ఒక రోజులో 20 లావాదేవీల పరిమితి అమల్లో ఉంది.
ఫోన్ పే
ఒక యూజర్ ఒక రోజుకు రూ.లక్షను బదిలీ చేసుకోవచ్చు. ఒకే లావాదేవీ కింద రూ.లక్ష మొత్తాన్ని పంపుకోవచ్చు.
గూగుల్ పే
రోజు మొత్తం మీద రూ.లక్ష వరకు నగదు బదిలీకి గూగుల్ పే సపోర్ట్ చేస్తుంది. ఒక రోజులో 10 సార్లకు మించి లావాదేవీలు చేసుకోలేరు.
అమెజాన్ పే
ఒక యూజర్ అమెజాన్ పే ద్వారా రూ.లక్షను వేరొకరికి పంపించుకోవచ్చు. ఇలా రోజు మొత్తంలో రూ.లక్ష పరిమితికి లోబడి లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది.
బ్యాంకుల వారీ పరిమితులు
పేటీఎం అయినా ఫోన్ పే అయినా వాటికి బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవడం ద్వారా యూపీఐ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమై పనిచేస్తుంది కనుక.. బ్యాంకులు సైతం యూపీఐ లావాదేవీల విలువపై పరిమితులు విధించాయి.
యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, సీఎస్ బీ, సిటీ యూనియన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఎస్ బీఐ తదితర బ్యాంకులు అన్నీ కూడా రోజు మొత్తం మీద రూ.లక్ష పరిమితిని యూపీఐ నగదు బదిలీలకు అమలు చేస్తున్నాయి. ఒకే లావాదేవీ కింద లేదంటే ఒకటికి మించిన లావాదేవీలు కింద రూ.లక్ష మొత్తాన్ని పంపుకోవచ్చు. కానీ, కొన్ని బ్యాంకులు రోజు మొత్తం మీద రూ.లక్షకు అనుమతిస్తున్నప్పటికీ, విడిగా ఒక్కో లావాదేవీకి రూ.5,000-10,000 పరిమితిని అమలు చేస్తున్నాయి.