court case: కలకత్తా హైకోర్టులో 1951లో దాఖలైన దావాకు 2023లో పరిష్కారం

  • బెర్హామ్ పోర్ బ్యాంకును కోర్టుకీడ్చిన ఖాతాదారులు
  • 72 ఏళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ సాగిన విచారణ
  • దేశంలో సుదీర్ఘ కాలం విచారణ జరిగిన కేసుల్లో ఇదొకటి
  • గత వారం ఈ దావాను క్లోజ్ చేసిన కలకత్తా హైకోర్టు సీజే
oldest pending case in india finally resolved after 72 years

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దాఖలైన కేసు అది.. విచారణ జరుగుతూ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. కిందటేడాది నవంబర్ లో మళ్లీ విచారణకు వచ్చింది. 72 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసును జడ్జి క్లోజ్ చేశారు. దేశంలోని న్యాయస్థానాల్లో దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఇదొకటి. బెర్హామ్ పోర్ బ్యాంకు లిక్విడేషన్ కు సంబంధించిన ఈ కేసు కలకత్తా కోర్టులో 1951లో దాఖలైంది.

ఇదీ కేసు..
1948 లో బెర్హామ్ పోర్ బ్యాంకు అప్పుల్లో కూరుకుపోయింది. ఖాతాదారులకు వారు దాచుకున్న సొమ్మును తిరిగిచ్చేందుకు డబ్బులేదని చేతులెత్తేసింది. బ్యాంకును మూసేయాలని తీర్మానించి యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. బ్యాంకు ఆస్తులను అమ్మేసి, అయినకాడికి అప్పులు తీర్చి, బ్యాంకును క్లోజ్ చేసేందుకు అనుమతికోరుతూ 1948 నవంబర్ 19న కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దీనిపై విచారణ జరుగుతుండగా.. 1951లో బెర్హామ్ పోర్ బ్యాంకు ఖాతాదారులు పలువురు తాము డిపాజిట్ చేసిన సొమ్ము ఇప్పించాలంటూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ కేసుపై అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. పలుమార్లు వాయిదా పడుతూ గతేడాది నవంబర్ లో మరోసారి విచారణకు వచ్చింది. అయితే, విచారణకు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కేసును న్యాయమూర్తి మరోమారు వాయిదా వేశారు. కిందటి వారంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై మరోమారు విచారణ చేపట్టారు. అయితే, ఈ కేసును 2006లోనే పరిష్కరించుకున్నట్లు బ్యాంకు తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ తెలియజేశారు. ఈ విషయం రికార్డుల్లో నమోదు కాకపోవడంతో బెర్హామ్ పోర్ బ్యాంకు కేసు అలాగే విచారణకు వస్తోందని చెప్పారు. రికార్డులు పరిశీలించిన న్యాయమూర్తి.. బెర్హామ్ పోర్ బ్యాంకు కేసును క్లోజ్ చేశారు.

More Telugu News