Kapil Dev: వీళ్లిద్దరిపై ఆధారపడి వరల్డ్ కప్ గెలవలేం: కపిల్ దేవ్

  • ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతున్న టీమిండియా
  • కేవలం కోహ్లీ, రోహిత్ లపైనే ఆధారపడొద్దన్న కపిల్ దేవ్
  • జట్టులో ఐదారుగురు మ్యాచ్ విన్నర్లు ఉండాలని సూచన
Kapil Dev advice for Team India

ఇటీవల కాలంలో ప్రధాన టోర్నీల్లో టీమిండియా ఆటతీరు విమర్శలపాలవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు. జట్టులో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడి పెద్ద టోర్నీల్లో గెలవాలంటే కుదరదని అభిప్రాయపడ్డారు. కేవలం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఆధారపడితే వన్డే వరల్డ్ కప్ గెలవలేరని, మ్యాచ్ ను మలుపుతిప్పగల ఆటగాళ్లు కనీసం నలుగురు లేదా ఐదుగురైనా జట్టులో ఉండాలని అన్నారు. 

జట్టులో ఒకరిద్దరిపై ఆధారపడే ధోరణి ఎక్కువగా ఉందని, అలా కాకుండా యువ ఆటగాళ్లు కూడా తమ ప్రతిభను చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐదారుగురు మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేసుకోవడం తప్పనిసరి అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. 

ప్రపంచకప్ సాధించాలంటే సెలెక్టర్లు, టీమిండియా మేనేజ్ మెంట్ కఠినంగా వ్యవహరించకతప్పదని కపిల్ దేవ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.

ధోనీ నాయకత్వంలో సొంతగడ్డపై 2011 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా మరో ఐసీసీ టోర్నీలో కప్ గెలవలేకపోయింది.

More Telugu News