మమతా బెనర్జీ మాటలకు చలించిన ప్రధాని మోదీ

  • మీ అమ్మ మాకు కూడా అమ్మేనన్న మమతా బెనర్జీ
  • మీ పని ద్వారా అమ్మ పట్ల గౌరవం చాటుతున్నారని ప్రశంస
  • మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు బలాన్ని ఇవ్వాలన్న ఆకాంక్ష
తల్లిని కోల్పోయి విచారంలో ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ.. వర్చువల్ గా కోల్ కతా నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా ఊపారు. దీంతో ప్రధాని మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడిన మాటలు ప్రధానిని కదిలించాయి.

‘‘పశ్చిమబెంగాల్ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోజు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి. 

మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు ఈ రోజు ఎంతో విచారకరమైనది. అయినప్పటికీ, ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరు కావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

హౌరా నుంచి న్యూ జల్పాయిగురి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ కూడా హాజరయ్యారు.

Mamata Banerjee
PM Modi
Vande Bharat train
launch
kolkata

More Telugu News