ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘనస్వాగతం

ఖమ్మంలో ఇవాళ తెలంగాణ టీడీపీ భారీ సభ నిర్వహిస్తోంది. టీడీపీ శంఖారావం పేరిట ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. 

ఈ మధ్యాహ్నం ఆయన హైదరాబాదు నుంచి భారీ వాహన శ్రేణితో ఖమ్మం బయల్దేరారు. ఆయనకు ఖమ్మం జిల్లా సరిహద్దులో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. వందల సంఖ్యలో వాహనాలతో కూడిన ఆయన కాన్వాయ్ ప్రస్తుతం కూసుమంచి మండలంలోంచి సాగుతోంది. మరికాసేపట్లో ఆయన ఖమ్మం చేరుకోనున్నారు. 

కాగా, చంద్రబాబు రాక నేపథ్యంలో ఖమ్మం పట్టణం పసుపుమయం అయింది. కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న తొలి భారీ బహిరంగ సభ ఇదే. దాంతో ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఖమ్మంలో ఎటు చూసినా పసుపు జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు సర్దార్ పటేల్ స్టేడియంకు భారీగా తరలివస్తుండడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.

Chandrababu
Khammam
Rally
TDP
Telangana

More Telugu News