తీవ్ర తుపానుగా మారిన 'మాండూస్'... పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం

  • బంగాళాఖాతంలో మాండూస్ తుపాను
  • పశ్చిమ వాయవ్య దిశగా పయనం
  • రేపు రాత్రి తీరం చేరనున్న తుపాను
  • తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం తమిళనాడులోని కారైక్కాల్ కు తూర్పు ఆగ్నేయంగా 420, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఇది క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. 9వ తేదీ రాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. మహాబలిపురం వద్ద భూభాగంపై ప్రవేశిస్తుందని వివరించింది. గడచిన 6 గంటలుగా ఈ తీవ్ర తుపాను గంటకు 12 కిమీ వేగంతో కదులుతోంది. 

దీని ప్రభావంతో నేడు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఈ నెల 10వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.


More Telugu News

Mandouse Severe Cyclonic Storm Bay Of Bengal Andhra Pradesh Tamilnadu IMD