Bode Prasad: కృష్ణా జిల్లా యనమలకుదురులో... టీడీపీ - వైసీపీ నేతల మధ్య గొడవ

  • ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ
  • యనమలకుదురులో బోడె ప్రసాద్ నేతృత్వంలో ఫ్లెక్సీల రూపంలో నిరసన
  • టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
Fight between TDP and YSRCP in Krishna district

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ 'ఇదేమి ఖర్మ రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

 పెనమలూరు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, అభివృద్ధి చేయలేదంటూ ఫ్లెక్సీల రూపంలో ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో యనమలకుదురు బ్రిడ్జిపై టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ నేతల మీదకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ మాజీ ఎంపీ బోడె ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్లను వెంటనే అక్కడి నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News