మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటు... ఆరేళ్ల పాటు బహిష్కరణ

పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్న మర్రి శశిధర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వేటు వేసింది. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. మర్రి శశిధర్ రెడ్డి నిన్న సాయంత్రం కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసిన నేపథ్యంలోనే వేటు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నేడు హైదరాబాదులో సమావేశమైంది. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కావడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించింది. 

అదే సమయంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తమ్మీద, మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో పార్టీ నుంచి తొలగించింది.

Marri Shashidhar Reddy
Congress
BJP
Telangana

More Telugu News