నానక్ రామ్ గూడలో విషాద ఘటన... ఈతకు వెళ్లి ముగ్గురు బాలుర మృతి

  • నానక్ రామ్ గూడ గోల్ఫ్ కోర్స్ పక్కనే చెరువు
  • సరదాగా ఈత కొట్టేందుకు దిగిన విద్యార్థులు
  • లోతుకు వెళ్లడంతో ఈత రాక మృతి
హైదరాబాద్ లోని గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన ముగ్గురు బాలలు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన నానక్ రామ్ గూడ చెరువు వద్ద జరిగింది. 

దీపక్, పవన్, షాబాజ్ 9వ తరగతి విద్యార్థులు. వీరు సరదాగా ఈత కొట్టేందుకు నానక్ రామ్ గూడ గోల్ఫ్ కోర్స్ పక్కనే ఉన్న చెరువులో దిగారు. వారు మరింత లోతుకు వెళ్లడంతో ఈత రాక మునిగిపోయారు. ఇతర విద్యార్థులు ఈ విషయం గమనించి అక్కడున్నవారికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ ముగ్గురు బాలురు పూర్తిగా మునిగిపోయారు. 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాలల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. టెలికాం నగర్ లో విషాదం నెలకొంది. కాగా, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Boys
Death
Swimming
Nanakram Guda
Hyderabad

More Telugu News