FCG: మునుగోడులో ఓటుకు రూ.9 వేలు ఇచ్చారు... ఈసీకి ఫిర్యాదు చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

FCG complains EC on money expenditure in Munugode
షార్ట్స్‌లో చూడండి
యుద్ధాన్ని తలపించేలా సాగిన మునుగోడు ఉప ఎన్నిక ఇటీవల పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజేతగా నిలిచారు. అయితే, మునుగోడు ఎన్నికల్లో ధనప్రవాహం కొనసాగిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ సీజీ) సంస్థ ఆరోపిస్తోంది. మునుగోడు ఎన్నికల్లో రూ.627 కోట్లు ఖర్చు చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

ఓటుకు రూ.9 వేల చొప్పున మునుగోడు నియోజకవర్గంలోని 75 శాతం ఓటర్లకు డబ్బు అందిందని వెల్లడించింది. కేవలం ఓటర్లకు ఇచ్చిన డబ్బే రూ.152 కోట్లు ఉంటుందని ఫోరం గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు. 

రూ.300 కోట్ల విలువైన మద్యం విచ్చలవిడిగా ప్రవహించిందని, ఒక్కో ర్యాలీకి రూ.2.5 కోట్ల చొప్పున 50 ర్యాలీలు జరిగాయని, వీటి మొత్తం ఖర్చు రూ.125 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ర్యాలీల సందర్భంగా ఒక్కొక్కరికి బిర్యానీ, మద్యంతో పాటు రూ.300 ముట్టచెప్పారని తెలిపారు. మొత్తమ్మీద ఒక్కొక్కరికి రూ.500 చెల్లించారని వెల్లడించారు. 

మునుగోడు ఎన్నికల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఎన్నికల సంఘం వీటిపై విచారణ చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది. 

రాజకీయ పార్టీల నుంచి ప్రజలే డబ్బును డిమాండ్ చేసిన దృష్టాంతాలు కూడా ఉన్నాయని, ఎన్నికల రోజున కొన్ని గ్రామాల ప్రజలు డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయబోమంటూ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై బైఠాయించిన ఘటనలు జరిగాయని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. వారి డిమాండ్లకు పార్టీలు తలొగ్గగా, ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగిందని ఆరోపించారు. 

మరికొన్నిచోట్ల అయితే... పొరుగు గ్రామాల్లో ఓటుకు రూ.5 వేలు ఇస్తున్నారని, తమకు కూడా అంతే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. డబ్బు డిమాండ్ చేశారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు తమ శక్తిమేర మునుగోడు ఓటర్లను అవినీతిపరులుగా తయారుచేశాయని పద్మనాభరెడ్డి విమర్శించారు.
Go Back to Shorts
FCG
EC
Munugode
ByPolls

More Telugu News