పార్లమెంటు శీతాకాల సమావేశాలకు దూరం కానున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు దూరం కానున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు మొదటి వారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత తేదీల ప్రకారం డిసెంబరు 7 నుంచి 29 వరకు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 

ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతోంది. భారత్ జోడో యాత్రకు మరికొన్ని వారాల సమయం పట్టనుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ స్పందించారు. 

రాహుల్ గాంధీతో పాటు తాను, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్ పాదయాత్రలో నడుస్తున్నామని, తాము పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరు కాకపోవచ్చని తెలిపారు. ఇదే విషయాన్ని లోక్ సభ స్పీకర్ కు, రాజ్యసభ చైర్మన్ కు తెలియజేస్తామని అన్నారు. 

మొత్తం 3,570 కిలోమీటర్ల మేర సాగనున్న భారత్ జోడో యాత్రలో ఇప్పటివరకు సగం దూరం నడిచామని జైరాం రమేశ్ వెల్లడించారు. మహారాష్ట్రలో భారీ స్పందన వస్తోందని, కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలు కూడా తమతో కలిసి పాదయాత్రలో నడుస్తున్నారని తెలిపారు.

Rahul Gandhi
Parliament
Winter Session
Bharat Jodo Yatra
Congress
India

More Telugu News