ప్రధానికి స్వాగతం పలికేందుకు విశాఖ చేరుకున్న గవర్నర్ హరిచందన్, సీఎం జగన్

  • నేడు విశాఖ వస్తున్న ప్రధాని మోదీ
  • రేపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • రోడ్ షో నిర్వహించనున్న బీజేపీ
  • రేపు విశాఖలో మోదీ బహిరంగ సభ
  • హాజరుకానున్న గవర్నర్, సీఎం జగన్
విశాఖపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తూర్పుతీర నగరానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ విశాఖ చేరుకున్నారు. 

కాగా, విశాఖలోని మారుతి జంక్షన్ లో ప్రధాని మోదీ ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కోసం బీజేపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఈ రాత్రి పవన్ కంటే ముందే ఏపీ బీజేపీ నేతలు ప్రధాని మోదీని కలవనున్నారు. రాత్రి 8.30 గంటలకు పవన్.. మోదీతో సమావేశం అవుతారు. 

విశాఖలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభలో ఎనిమిది మందికే అనుమతించారు. ప్రధానితో పాటు వేదికపై గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, పీవీఎన్ మాధవ్ మాత్రమే ఉంటారు. 

ఈ సభలో ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు, ఏపీ సీఎం జగన్ 7 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహిస్తారు.

Narendra Modi
Vizag
Governor
Jagan
Andhra Pradesh

More Telugu News