తెలంగాణ మిషన్ భగీరథకు 'జల్ జీవన్ మిషన్' అవార్డును ప్రకటించిన కేంద్రం... గాంధీ జయంతి రోజున అవార్డు ప్రదానం
- ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటి సరఫరాకు అవార్డు అందిస్తున్న కేంద్రం
- ఇప్పటికే ఓ దఫా అవార్డును కైవసం చేసుకున్న మిషన్ భగీరథ
- 2022 ఏడాదికి కూడా తెలంగాణనే అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇతరత్రా ఎన్ని పథకాలు ఉన్నా... సీఎం కేసీఆర్ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని పల్లెలు... చివరకు అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వం మంచినీటిని సరఫరా చేస్తోంది.
ఏటా జల్ జీవన్ మిషన్ అవార్డును ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఈ ఏడాది కూడా అవార్డు గ్రహీత ఎంపిక కోసం సుదీర్ఘ కసరత్తు చేపట్టింది. ఓ స్వతంత్ర సంస్థతో ఆయా రాష్ట్రాల్లో రక్షిత మంచి నీటి సరఫరాపై సర్వే చేయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో 320 గ్రామాల్లో ఆ సంస్థ సర్వే చేపట్టింది. ఆయా గ్రామాల్లో ఇళ్లకు అందుతున్న మంచి నీటి నాణ్యతతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించిన ఆ సంస్థ జల్ జీవన్ మిషన్ అవార్డుకు తెలంగాణను ఎంపిక చేసింది.