ఆ షూటింగులో విజయశాంతి నాపై విసుక్కున్నారు: శరత్ కుమార్

Sharath Kumar Interview
  • 140 సినిమాలకి పైగా చేసిన శరత్ కుమార్ 
  • తాజా చిత్రంగా రానున్న 'పొన్నియిన్ సెల్వన్' 
  • ఫస్టు సినిమాను తెలుగులోనే చేశానంటూ వెల్లడి
  • విజయశాంతి ఫీలయ్యారంటూ వివరణ
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో శరత్ కుమార్ ఒకరుగా కనిపిస్తారు. వివిధ భాషల్లో 140కి పైగా సినిమాలు చేసిన ఆయన,  తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మణిరత్నం తాజా చిత్రంగా వస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలోను ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన కూడా బిజీగానే ఉన్నారు.

తాజా ఇంటర్వ్యూలో శరత్ కుమార్ మాట్లాడుతూ .. "నా ఫస్టు సినిమానే నేను తెలుగులో చేశాను .. ఆ సినిమా పేరు 'సమాజంలో స్త్రీ'. ఆ సినిమాలో విజయశాంతి హీరోయిన్ .. అప్పటికే ఆమె బిజీ ఆర్టిస్ట్. ఆ సినిమాలో విజయశాంతి కాంబినేషన్లో ఒక సీన్ చేయవలసిన ఆర్టిస్ట్ రాలేదు. నిర్మాత నా స్నేహితుడే కావడంతో, నన్ను ఆ సీన్ చేయమన్నాడు.

అప్పటికి నాకు యాక్టింగ్ అలవాటు లేదు .. అందువలన ఆ సీన్ వెంటనే చేయలేకపోయాను. టేకుల మీద టేకులు తీసుకుంటున్నాను. విజయశాంతి ఆ షూటింగ్ తరువాత వెంటనే చెన్నై వెళ్లిపోవాలి. అందువలన ఆమె టెన్షన్ పడిపోయారు. కొత్త వాళ్లను తీసుకొచ్చి నా టైమ్ అంతా వేస్టు చేస్తున్నారు. మంచి ఆర్టిస్ట్ ను పెట్టొచ్చుగదా?' అంటూ ఆమె విసుక్కున్నారు.

 ఆ తరువాత కొంతకాలానికి 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విజయశాంతిగారి కాంబినేషన్లో చేయవలసి వచ్చింది. ఆల్రెడీ నేను ఆమెతో యాక్ట్ చేసినట్టుగా చెబితే, ఎప్పుడు? .. ఏ సినిమాలో? అని అడిగారు. 'సమాజంలో స్త్రీ' సినిమా అంటూ ఆమె విసుక్కోవడం గురించి కూడా చెప్పాను. 'అయ్యో అవునా .. సారీ అండీ' అంటూ ఆమె ఫీలయ్యారు" అంటూ చెప్పుకొచ్చారు శరత్ కుమార్.
Go Back to Shorts
Sharath Kumar
Vijayashanthi
Ponniyin Selvan Movie

More Telugu News