గ్రాండ్ అలయెన్స్ దిశగా అడుగులు.. ఆరేళ్ల తర్వాత సోనియాను కలుస్తున్న నితీశ్ కుమార్

దేశంలో బీజేపీని ఎదుర్కోవడానికి మరో మహా కూటమికి బీజం పడబోతోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గ్రాండ్ అలయెన్స్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు. వచ్చే ఆదివారం సాయంత్రం ఢిల్లీలో వీరు సమావేశమవనున్నారు. ఇదే జరిగితే ఆరేళ్ల తర్వాత సోనియా, నితీశ్ కుమార్ తొలిసారి కలుసుకున్నట్టు అవుతుంది. 2015లో బీహార్ ఎన్నికలకు ముందు ఒక ఇఫ్తార్ విందులో చివరి సారి సోనియా, నితీశ్ కలిశారు. 

మరోవైపు, ఎల్లుండి జరగబోయే సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరైతే బాగుంటుందని ఈ ఇద్దరు బీహార్ నేతలు భావిస్తున్నారు. అయితే, భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు రాహుల్ గాంధీని నితీశ్ కలిశారు. అయితే, ఆ సమయంలో వైద్య చికిత్స నిమిత్తం సోనియాగాంధీ విదేశాల్లో ఉన్నారు. మరోవైపు.. సోనియా, నితీశ్, లాలూల భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Sonia Gandhi
Rahul Gandhi
Congress
Nitish Kumar
JDU
Lalu Prasad Yadav
RJD
Grand Alliance

More Telugu News