నిమజ్జనానికి కదిలిన ఖైరతాబాద్ మహా గణపతి... వైభవంగా శోభాయాత్ర

  • హైదరాబాదులో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర
  • భారీగా తరలివస్తున్న గణనాథులు
  • మిన్నంటుతున్న భక్తుల కోలాహలం
  • ఖైరతాబాద్ గణపతికి హారతి పట్టి, దిష్టి తీసిన నిర్వాహకులు
హైదరాబాద్ గణేశ్ నిమజ్జన శోభా యాత్ర కొనసాగుతోంది. 50 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి కూడా నిమజ్జనానికి బయల్దేరడంతో శోభా యాత్ర మరింత కోలాహలంగా మారింది. ఖైరతాబాద్ మహాలక్ష్మి గణేశుడికి నిర్వాహకులు హారతి పట్టి, దిష్టి తీసి యాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. గణేశ్ నిమజ్జన ఉత్సవం నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. మాస్టర్ కంట్రోల్ రూం నుంచి శోభాయాత్ర సాగుతున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. 

అటు, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాల జోరు కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన క్రేన్ లు గణేశుడి విగ్రహాలను జలప్రవేశం చేయిస్తున్నాయి. టాంక్ బండ్ వద్ద వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు 20 జేసీబీలు ఏర్పాటు చేశారు. 

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాదు, నేడు, రేపు మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలిచ్చారు.

Khairatabad Maha Ganapathi
Immersion
Shobha Yatra
Hyderabad

More Telugu News