liger: ఏడో రోజూ ‘లైగర్’కు నిరాశే.. కోటి కూడా దాటని వసూళ్లు

  • అన్ని భాషల్లో కలిపి ఏడో రోజు వచ్చింది రూ. 90 లక్షలు మాత్రమే
  • మరికొన్ని రోజుల్లో థియేటర్ల నుంచి వైదొలిగే అవకాశం
  • 90 కోట్లతో నిర్మించిన చిత్రానికి భారీ నష్టాలు
Vijay Deverakonda film Liger to be out of theatres soon

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ సినిమా 2022లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఒక్క వారంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా క్రాష్ అయ్యింది. దేశం మొత్తం మీద అన్ని భాషల్లో కలిపి రోజుకు కోటి రూపాయాల వసూళ్లు కూడా రాబట్టడం కష్టం అవుతోంది. 

‘లైగర్’ చిత్రంపై విమర్శకులు పెదవి విరవగా.. ప్రేక్షకులు సైతం ఏ మాత్రం ఆదరించలేకపోయారు. భారీ ఓపెనింగ్స్ లభించినప్పటికీ, నెగిటివ్ మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా నిండా మునిగిపోయింది. దెబ్బకు వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఏడో రోజు ఇండియా మొత్తం మీద రూ. 90 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత దారణంగా ఫెయిలైందో చెప్పొచ్చు. ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే సినిమా థియేటర్ల నుంచి పూర్తిగా వైదొలగే అవకాశం ఉంది.

పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ ఆగస్టు 25 న తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదలైంది. ఇది విజయ్ దేవరకొండ కు మొదటి పాన్-ఇండియా చిత్రం. పూరీ, చార్మీ కౌర్, కరణ్ జొహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌  టైనర్ కోసం విజయ్, పూరీ మూడేళ్లు కష్టపడ్డారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా, విజయ్, అనన్య దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. కానీ, కథ, కథనం ఏదీ ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. దాదాపు రూ. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు, పంపిణీదారులకు నష్టాలను మిగల్చనున్నట్టు చెబుతున్నారు. 

More Telugu News