బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ శరీరంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
- ఈ నెల 23న గోవాలో సోనాలీ ఫోగాట్ మృతి
- తొలుత గుండెపోటు అని చెప్పిన పోలీసులు
- పోస్టుమార్టం నివేదికతో వ్యక్తిగత సహాయకులపై అనుమానం
- హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు
గోవాలో ఈ నెల 23న సోనాలీ ఫోగాట్ అపస్మారక స్థితిలో ఉండగా, ఆమె వ్యక్తిగత సిబ్బంది సుధీర్ సాగ్వాన్, సుఖ్విందర్ వసీ స్థానిక సెయింట్ ఆంథోనీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
కాగా, తన సోదరిపై ఆమె సహాయకులుగా చెప్పుకుంటున్న సుధీర్ సాగ్వాన్, సుఖ్విందర్ మూడేళ్ల కిందట అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ వీడియోతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సోనాలీ సోదరుడు రింకు ఢాఖా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారే తన సోదరిని హత్య చేశారని ఆరోపించారు. తన ఆహారంలో ఏదో కలిపారని ఆమె తమతో చెప్పిందని రింకు వెల్లడించారు. అనుమానితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.
టిక్ టాక్ వీడియోలతో ఎంతో ఫేమస్ అయిన సోనాలీ ఫోగాట్ 2019లో హర్యానా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. 2020లో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని గుర్తింపు పొందింది. సోనాలీ ఫోగాట్ కు 15 ఏళ్ల యశోధర అనే కుమార్తె ఉంది. సోనాలీ భర్త 2016లో మరణించాడు.