Chandrababu: అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు.. చంద్రబాబు ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ర్యాలీ నిర్వహిస్తూ బలప్రదర్శన నిర్వహించారు. కుప్పం బంద్ కు పిలుపునిచ్చారు. మరోవైపు బస్టాండ్ సమీపంలో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేశారు. ఈ క్యాంటీన్ ను చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. 

బస్టాండ్ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలోకి కూడా చొచ్చుకుపోయేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మరోవైపు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కుప్పంకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇంకోవైపు అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు.
Chandrababu
Telugudesam
Kuppam
Anna Canteen
YSRCP

More Telugu News