హిందువులకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అభయం

  • మైనారిటీలమనే భావన నుంచి బయటకు రావాలని పిలుపు
  • బంగ్లాదేశ్ పౌరులందరికీ సమాన హక్కులు ఉంటాయని స్పష్టీకరణ 
  • తమను తాము కించపరుచుకోవద్దన్న బంగ్లా ప్రధాని
బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా జీవిస్తున్న హిందువులకు భరోసా, అభయమిచ్చే ప్రయత్నం చేశారు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా. తాము ఈ దేశంలో మైనారిటీలుగా ఉన్నామనే భావనను వారు వీడాలని కోరారు. బంగ్లాదేశ్ లో ప్రజలు అందరూ వారి మతంతో సంబంధం లేకుండా సమాన హక్కులను పొందొచ్చని ప్రకటించారు. శ్రీక‌ృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఢాకాలో ఢాకేశ్వరి మందిర్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె వర్చువల్ గా మాట్లాడారు.

‘‘అన్ని మత విశ్వాసాలను అనుసరించే వారు సమాన హక్కులతో జీవించాలని కోరుతున్నాం. నీవు ఈ దేశ పౌరుడు/పౌరురాలు అయితే నాకు మాదిరే నీకు కూడా సమాన హక్కులు ఉంటాయి’’ అని షేక్ హసీనా అన్నారు. దయ చేసి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండని కోరారు. ప్రజలు అందరూ ఇదే విశ్వాసంతో ముందుకు వెళితే మత సామరస్యానికి భంగం కలగదన్నారు. 

‘‘దేశంలో ఏదైనా ఘటన జరిగినప్పుడు ఈ దేశంలో హిందూ ప్రజలకు ఎటువంటి హక్కులూ లేవన్న తీరులో ఇంటా బయటా చిత్రీకరించే ప్రచారం జరుగుతోంది. అయితే, ఏ ఘటన జరిగినా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’’ అని షేక్ హసీనా చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీడియా సరిగ్గా దృష్టి పెట్టడం లేదన్నారు.

Bangladesh
Sheikh Hasina
Hindu community
minorities
rights

More Telugu News