పదవే కావాలనుకుంటే ఎప్పుడో ఎంపీని అయ్యేవాడిని: పవన్ కల్యాణ్

రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై తాను ప్రశ్నిస్తుంటే... ముఖ్యమంత్రి జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇష్టానుసారం మాట్లాడేవారికి తాను కూడా జవాబు చెప్పగలనని అన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారనే విషయం తనకు తెలుసని చెప్పారు. ప్రధాని ముందు వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా మెదపరని విమర్శించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు.

జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలు బలోపేతం అవుతాయని పవన్ చెప్పారు. రాజకీయాల్లో మార్పు గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్క తేలుస్తామని చెప్పారు. అప్పులు చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని వైసీపీ చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. 

రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని పవన్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో జనసేన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. గుడివాడలో ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోందని చెప్పారు. పార్టీని నడిపే సత్తా వైసీపీకే ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలంతా ఈసారి జనసేనకు మద్దతివ్వాలని కోరారు. తాను పదవినే కోరుకుని ఉంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని చెప్పారు.


More Telugu News