విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మార్గరెట్ అల్వా

  • ఆగస్టు 10తో ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం
  • నూతన ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఎన్నికలు
  • ఎన్డీయే తరఫున పోటీచేస్తున్న జగ్ దీప్ ధన్ ఖడ్ 
  • మార్గరెట్ అల్వాను బరిలో దించిన విపక్షాలు
నిన్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగ్గా, ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు దాదాపు ఖాయమైంది. ఇప్పుడందరి దృష్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలపై పడింది. ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే తరఫున బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ ఖడ్, విపక్షాల తరఫున మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు. 

సీనియర్ కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నేడు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఇతర మిత్రపక్షాల నేతలతో కలిసి పార్లమెంటుకు వచ్చిన ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 

కాగా, నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుంది. రేపు (జులై 20) నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 22 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ను ఆగస్టు 6న నిర్వహించనున్నారు.

Margaret Alva
Nomination
Vice President
Elections
Opposition
India

More Telugu News