మాజీ నక్సలైట్ ను తన బస్సులోకి పిలిపించుకొని మాట్లాడిన సీఎం కేసీఆర్

Cm KCR talksTO  former female naxalite in warangal tour
  • ఏటూరునాగారంలో సమీక్ష ముగించుకొని వెళ్తుండగా సీఎంను కలిసేందుకు ప్రయత్నించిన స్వరూప అలియాస్ సంధ్య
  • భద్రతా సిబ్బంది అడ్డుకోవడం చూసి బస్సులోకి పిలిపించుకున్న కేసీఆర్
  • గతంలో మావోయిస్టు పార్టీలో పని చేసి లొంగిపోయిన తర్వాత టీఆర్ఎస్ లో చేరిన స్వరూప
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఏటూరునాగారం వచ్చిన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మహిళా నక్సలైట్ ను సీఎం కేసీ ఆర్ తన బస్సులోకి పిలిపించుకొని మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

వరదలపై ఏటూరునాగారంలో సమీక్ష పూర్తి చేసుకొని హన్మకొండకు సీఎం బయలుదేరుతుండగా.. మాజీ నక్సలైట్, టీఆర్ఎస్ నాయకురాలైన పురి స్వరూప అలియాస్ సంధ్య కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఇది చూసిన సీఎం.. ఆమెను బస్సులోకి పిలిపించుకొని మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, మనం ఇంకా ఉద్యమాలు చేయాలని ఆమెతో సీఎం అన్నారు. త్వరలోనే హైదరాబాద్ కు పిలిపించుకొని మరిన్ని విషయాలు మాట్లాడుతానని ఆమెకు కేసీఆర్ హామీ ఇచ్చారు.

తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన స్వరూప చిన్నవయసులోనే మావోయిస్టు పార్టీలో చేసి పని చేశారు. తర్వాత పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేస్తున్నారు. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పానని స్వరూప తెలిపారు. తన మాటలు విన్న సీఎం.. తన ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారని, హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడుతానని హామీ ఇచ్చారని స్వరూప వెల్లడించారు.
Go Back to Shorts
KCR
Telangana
NAXALITE
WARANGAL TOUR
FLOOD
REVIEW

More Telugu News