Hyderabad: 21 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం.. హైదరాబాదు పబ్ ల ముందు పోస్టర్లు

  • మే 27నాటి ఘటన తర్వాత మార్పు
  • పెద్దలతో కలసి వచ్చినా అనుమతి నిరాకరణ
  • మధ్యాహ్నం లంచ్ పార్టీలకు కొన్ని అనుమతి
Hyderabad pubs ramp up vigil slam door on under 21 years

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత హైదరాబాద్ లోని పబ్ నిర్వాహకుల తీరులో కొంత మార్పు కనిపిస్తోంది. 21 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం అంటూ పబ్ ల ముందు బోర్డులు వెలిశాయి. ఇటీవలే ఓ పబ్ నుంచి మైనర్ బాలికను కారులో తీసుకెళ్లిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం పెద్ద సంచలనంగా మారడం తెలిసిందే. ప్రముఖుల పిల్లలు ఈ కేసులో నిందితులుగా ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటన తర్వాత పబ్ ల సంస్కృతిపై బీజేపీతోపాటు ఇతర ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి.

ఈ పరిణామాలతో పబ్ ల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మేజర్ అయిన వారికి పబ్ లో ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అందుకనే 21 ఏళ్లు అంటూ పబ్ ల ముందు బోర్డులు వెలిశాయి. 21 ఏళ్లలోపు వారు ఒక్కరున్నా.. గ్రూపు, కుటుంబ పార్టీలకు పబ్ లు నో చెబుతున్నాయి. 

కొన్ని పబ్ లు పదేళ్లలోపు పిల్లలను పెద్దలతో కలసి లంచ్ పార్టీలకు అనుమతిస్తున్నాయి. కాకపోతే ఎక్కువ శాతం పబ్ లు పెద్దలకు మాత్రమే ప్రవేశం అన్న నిబంధనను పాటిస్తున్నాయి. మే 27 నాటి ఘటన తర్వాత పబ్ యజమానులు తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు.. ఎవరికీ అవకాశం ఇవ్వరాదని భావిస్తున్నట్టు ఓ పబ్ నిర్వాహకుడు తెలిపారు. అందుకనే పెద్దలతో కలసి వచ్చినా మైనర్లను పబ్ లు అనుమతించడం లేదు.

More Telugu News