Water: జాబిల్లిపై నీటి జాడలు గుర్తించిన చైనా

China scientists identifies water traces on Moon
షార్ట్స్‌లో చూడండి
చంద్రుడి ఉపరితలంపై చైనా చేపట్టిన పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. జాబిల్లిపై నీటి జాడలు ఉన్నట్టు చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడిపై ఓ అగ్నిపర్వత శిలను పరీక్షించిన మీదట వారు ఈ నిర్ణయానికి వచ్చారు. చైనా చంద్రుడిపైకి మానవ రహిత వ్యోమనౌకను పంపించింది. ఈ మిషన్ కు చెందిన పరికరాల ద్వారా చంద్రుడిపై 'ఓషన్ ఆఫ్ స్టార్మ్స్' అనే ప్రాంతంలో ఘనీభవించిన లావా అవశేషాలను విశ్లేషించారు. అపటైట్ అనే స్ఫటిక లవణంలో హైడ్రాక్సిల్ రూపంలో నీరు ఉన్నట్టు గుర్తించారు. 

సాధారణంగా నీటి అణువులో ఒక వంతు ఆక్సిజన్, రెండు వంతుల హైడ్రోజన్ ఉంటాయి. అదే, హైడ్రాక్సిల్ లో ఒక వంతు ఆక్సిజన్, ఒక వంతు హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. దశాబ్దాల కిందట నాసా సేకరించిన చంద్ర శిలల్లోనూ ఈ హైడ్రాక్సిల్ ఆనవాళ్లు బయటపడ్డాయి. సూర్యుడి వేడిమికి ఉత్తేజితమైన పరమాణువులు విస్ఫోటనం చెందిన కారణంగానే చంద్రుడిపై చాలా భాగం నీరు ఏర్పడి ఉంటుందని అత్యధికుల భావన. 

కాగా, రాబోయే సంవత్సరాల్లో చంద్రుడిపై నీటి ఆనవాళ్ల పరిశోధనకు మరిన్ని మానవ రహిత యాత్రలు చేపట్టాలని చైనా సన్నద్ధమవుతోంది. చంద్రుడిపై నీరు అంశం సౌర వ్యవస్థ పరిణామక్రమాన్ని మరింత స్పష్టంగా వివరించేందుకు అవసరమైన సమాచారాన్ని అందించనుంది. 

అయితే, చంద్రుడిపై నీటికి వనరులు ఏమిటి? జాబిల్లిపై జలచక్రం వివరాలు ఇప్పటికీ ఏకాభిప్రాయం లేని బహిరంగ ప్రశ్నలేనని చైనా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా గుర్తించిన హైడ్రాక్సిల్ మూలాలు స్ఫటిక లవణాల్లో కాకుండా, బయటే ఉన్నాయని భావిస్తున్నప్పటికీ, దానిపై చైనా పరిశోధకులు స్పష్టత ఇవ్వలేకపోయారు.
Go Back to Shorts
Water
Moon
China
Hydroxyl

More Telugu News