Araku: వైసీపీ ఎమ్మెల్యే ఫల్గుణ కండువా పట్టుకుని దాడికి యత్నించిన మహిళలు!

  • అరకులోని మాడగడ గ్రామంలో ఘటన
  • దుర్భాషలాడుతూ వెంబడించిన మహిళలు, గిరిజనులు
  • ఆరోపణలు అవాస్తవమన్న ఎమ్మెల్యే
  • భూముల ధరలు పెరగడంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన
Tribals Try to attack Araku MLA Chetti Palguna

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను చూడగానే రంకెలేసిన మహిళలు మెడలోని కండువా పట్టుకుని దాడికి యత్నించారు. దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో పోలీసుల రక్షణ మధ్య ఆయన బయటపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామంలో జరిగిందీ ఘటన. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్యే నిన్న గ్రామానికి చేరుకున్నారు.

ఆయనను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు గిరిజన మహిళలు.. ‘‘మా భూములను కబ్జా చేసి మళ్లీ మా ఊరే వస్తావా?’’ అంటూ ఆయన మెడలోని కండువా పట్టుకుని నిలదీశారు. గిరిజనులందరూ గుమికూడి ఆయనపైకి ఎగబడి దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని దూరంగా తీసుకెళ్లారు. అయినా శాంతించని గ్రామస్థులు భూములను కబ్జా చేస్తావా? అని దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో చేసేది లేక పోలీసులు, వైసీపీ కార్యకర్తల రక్షణ మధ్య అక్కడి నుంచి ఆయన బయటపడ్డారు.

అనంతరం భూముల కబ్జా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను బ్యాంకు ఉద్యోగిగా ఉన్న సమయంలో 2012లో గోమంగి మధుసూదనరావు నుంచి సర్వే నంబరు 82లో ఉన్న 5.72 ఎకరాల పట్టాభూమిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయన్నారు. అయితే, ఇప్పుడీ భూముల ధరలు పెరగడంతో కావాలనే తాను ఆ భూమిని కబ్జా చేసినట్టు ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కసుతోనే వారు తనపై అలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News