ఉదయం పెళ్లి.. అప్పగింతలకు ముందు విషం తాగి నవ వధువు ఆత్మహత్య

ఇష్టం లేని పెళ్లిని అంగీకరించలేని ఓ నవ వధువు అప్పగింతలకు ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి (19) పదో తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంటి వద్దే వుంటోంది. ఇటీవల ఆమెకు అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో వివాహం నిశ్చయమైంది.

అయితే, అంతదూరపు సంబంధం తనకు ఇష్టం లేదని లక్ష్మి తన తల్లికి చెప్పింది. అయినప్పటికీ ఆమె మాటలను పెద్దలు పట్టించుకోకుండా నిన్న ఉదయం 9 గంటలకు వివాహం జరిపించారు. అయితే, వివాహం ఇష్టం లేని లక్ష్మి సాయంత్రం అప్పగింతల సమయానికి ముందు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో అప్పటి వరకు పెళ్లితో కళకళలాడిన ఇంట్లో విషాదం అలముకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
Mahabubnagar
Anantapur District
Bride

More Telugu News