ఇండోనేషియా నిర్ణయంతో వంటనూనెల ధరలు భగ్గుమననున్నాయా?

  • వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియాలో నిషేధం
  • ధరల కట్టడికి అక్కడి సర్కారు నిర్ణయం
  • ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న పరిశ్రమ
  • లేదంటే ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళన
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా తాజా నిషేధం విధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని పరిశ్రమ కోరుతోంది.

‘‘ఉక్రెయిన్ లో యుద్ధం వల్ల సన్ ఫ్లవర్ నూనె సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు పామాయిల్ సరఫరా కూడా తగ్గితే ధరలు ఆకాశాన్నంటుతాయి. ధరలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇండోనేషియా నిర్ణయం ఒత్తిళ్లను పెంచడమే కాకుండా, సరఫరాపైనా ప్రభావం చూపిస్తుంది’’ అని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్షర్స్ అసోసియేషన్ ఈడీ బీవీ మెహతా తెలిపారు.

ఈ అనూహ్య నిర్ణయం కారణంగా ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇండోనేషియా ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కేంద్ర సర్కారు కృషి చేయాలని కోరారు. అక్కడి నుంచి ఎగుమతులు మొదలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.

స్థానికంగా ధరలు పెరిగిపోవడం, పామాయిల్ కు కొరత అంశాల నేపథ్యంలో ఎగుమతులను నిషేధిస్తూ ఇండోనేషియా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. భారత్ లో వంట నూనెల వినియోగం ఒక నెలకు 18 లక్షల టన్నులు ఉంటే, 6-7 లక్షల టన్నుల పామాయిల్ ఇండోనేషియా నుంచే వస్తోంది.

Edible oil
imports
indonesia
ban
industry
palmoil

More Telugu News