రాజకీయాలకు విరామం ప్రకటించాలనిపిస్తున్నా, ప్రజల ప్రేమాభిమానాలు అడ్డుకుంటున్నాయి: మంత్రి ధర్మాన

  • వయోభారం కారణంగా తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలనిపిస్తోందన్న మంత్రి  
  • రెవెన్యూశాఖలో అవినీతి పేరుకుపోయిందని ఆవేదన
  • ఇది మనందరం సిగ్గుపడాల్సిన విషయమన్న ధర్మాన
వయోభారం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనిపిస్తోందని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అయితే, ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు తనను ఆ పనిచేయకుండా కట్టిపడేస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళంలో నిన్న పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేస్తానని అన్నారు.

అవినీతిని నివారించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా బ్యాంకుల నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే విధానాన్ని తీసుకువచ్చారన్నారు. అయినప్పటికీ అవినీతి తగ్గుముఖం పట్టలేదని, ఇది సిగ్గు పడాల్సిన విషయమని అన్నారు. 

కులాన్ని, మతాన్ని చూసి ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు. నిజాయతీగా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం అందుకు నిదర్శనమని మంత్రి అన్నారు.

Dharmana Prasad
Andhra Pradesh
Srikakulam District
Revenue Minister

More Telugu News