Sri Lanka: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక.. కేబినెట్ మొత్తం రాజీనామా

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి బయటపడేందుకు నానాపాట్లు పడుతున్న శ్రీలంకలో పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ కేబినెట్‌లోని 26 మంది మంత్రులు మొత్తం తమ పదవులకు గతరాత్రి రాజీనామా చేశారు. అనంతరం ప్రధానికి రాజీనామా పత్రాలు సమర్పించారు. రాజీనామాలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు. 

ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంకలో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గుడ్డు నుంచి పాల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలు, నిత్యావసరాల కొరత, విద్యుత్ కోతలతో అవస్థలు పడుతున్న ప్రజలు ఇటీవల అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. దీంతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
Sri Lanka
Mahinda Rajapaksa
Ministers

More Telugu News