మానవత్వం మిగిలే ఉందనడానికి అతడే నిదర్శనం: సాయితేజ్

  • గతంలో సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం
  • పూర్తిగా కోలుకున్న వైనం
  • తనను కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు
  • ప్రత్యేక వీడియో విడుదల చేసిన సాయితేజ్
టాలీవుడ్ మెగా హీరో సాయితేజ్ గతంలో ఓ రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తాజాగా ఓ వీడియోలో సాయితేజ్ వివరించాడు. తనను కాపాడిన ఓ వ్యక్తి గురించి వెల్లడించాడు. హైదరాబాదులో ఓ రోడ్డుపై తాను బైక్ ప్రమాదానికి గురికాగా, తనను ఆసుపత్రిలో చేర్చించిన వ్యక్తి పేరు సయ్యద్ అబ్దుల్ ఫరూఖ్ అని వెల్లడించాడు. అతడు సకాలంలో ఆసుపత్రిలో చేర్పించాడని, మానవత్వం ఇంకా మిగిలి ఉందని అబ్దుల్ వంటి వ్యక్తుల వల్లే తెలుస్తుందని అన్నాడు. 

అంతేకాదు, హెల్మెట్ పెట్టుకోవడం కూడా తన ప్రాణాలు నిలవడానికి ఓ ముఖ్య కారణమని సాయితేజ్ వివరించాడు. బైక్ పై ఎక్కడికి వెళ్లినా హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మరువరాదని తెలిపాడు. ఇక, మెడికవర్, అపోలో ఆసుపత్రుల్లో తనకు మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లు, ఇతర సిబ్బందికి రుణపడి ఉంటానని వివరించాడు. ఈ సందర్భంగా తన మేనమామలు చిరంజీవి, పవన్ కల్యాణ్, ఇతర టాలీవుడ్ సినీ పెద్దలకు, తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరు హీరోల అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. 

వాస్తవానికి తన కొత్త చిత్రం ప్రారంభం కావాల్సి ఉన్నా, తాను ఆరోగ్యవంతుడ్ని అయ్యేంత వరకు ఆగిన బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు వెల్లడించాడు. తన కొత్త ప్రాజెక్టు ఈ నెల 28న పట్టాలెక్కనుందని సాయితేజ్ పేర్కొన్నాడు.

Saitej
Video
Road Accident
Abdul
Hyderabad
Tollywood

More Telugu News