Payyavula Keshav: వేల కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయో తెలియడంలేదు: పయ్యావుల

ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రజాపద్దుల సంఘం చైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మరోసారి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నికార్సయిన అభిప్రాయం వెలిబుచ్చిందని తెలిపారు. రూ.48 వేల కోట్లకు సంబంధించి రికార్డు సరిగా లేదని కాగ్ చెప్పిందని వెల్లడించారు. కాగ్ అనుమానాలను రాష్ట్ర సర్కారు ఇంతవరకు నివృత్తి చేయలేదని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ఎటు వెళుతున్నాయో తెలియడంలేదని పయ్యావుల సందేహం వ్యక్తం చేశారు. 

ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటి అప్పులు చేశారని, ప్రభుత్వం చేసిన అప్పుల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 శాతం బడ్జెట్ కు లెక్కలు లేవని తెలిపారు. నీటిపారుదల శాఖలో ఈ మూడేళ్ల వ్యవధిలో ఎంత ఖర్చు పెట్టారు? అని నిలదీశారు. ప్రజాధనాన్ని రక్షించే బాధ్యత తమకుంది కాబట్టే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. 

అకౌంట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కూడా రాష్ట్రం భయపడుతోందని వ్యాఖ్యానించారు. వ్యవసాయశాఖను మూసివేసే దిశగా వైసీపీ పాలన ఉందని పయ్యావుల విమర్శించారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, చెత్తపై వేసే పన్నులు బాగా పెంచారని తెలిపారు. మూడేళ్ల వైసీపీ పాలనలో మద్యం ఆదాయం రెట్టింపైందని అన్నారు.
Payyavula Keshav
AP Govt
Finance
Economy
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News