TDP: ఉంగుటూరు పీఎస్కు టీడీపీ ఎమ్మెల్యేలు.. పరామర్శించిన నారా లోకేశ్
![tdp mlas sent to unguturu police station](https://img.ap7am.com/bimg/cr-20220323tn623b16bf6b716.jpg)
- సారా మరణాలపై వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేల యత్నం
- అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఆపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్కు తరలింపు
- పోలీసుల తీరుపై నారా లోకేశ్ ఫైర్
నాటు సారా మరణాలపై ఎక్సైజ్ శాఖ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఉంగుటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయవాడలో అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలను ఉంగుటూరు తరలించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఉంగుటూరు బయలుదేరారు. కాసేపటి క్రితం అక్కడికి చేరుకున్న లోకేశ్ అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యేలను పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు కూడా టీడీపీ ఎమ్మెల్యేలను అనుమతించరా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలనకు ఈ చర్య నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్దకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలను ఉంగుటూరు పీఎస్కు తరలించిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను మాత్రం కంకిపాడు పీఎస్కు తరలించారు.