Gadikota Srikanth Reddy: ఇంగ్లిష్ మీడియం పెడతామంటే సినిమాల్లో క్లాప్స్ కొడతారు... మన రాష్ట్రంలో కొందరు ఏడుస్తున్నారు: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Srikanth Reddy talks about english medium
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఇంగ్లిష్ మీడియం పెడతామంటే సినిమాల్లో క్లాప్స్ కొడతారని, మన రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం పెడతామంటే మాత్రం కొందరు ఏడుస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రంలో నాణ్యమైన విద్యకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని తెలిపారు. నాడు-నేడు కింద మూడు దశల్లో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారుచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. 

"ఫేజ్-1లో 14 వేలకు పైగా స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో పూర్తిగా ఆధునికీకరించారు. నాడు-నేడు కింద అభివృద్ధి చేశామని ధైర్యంగా చెప్పుగలుగుతున్నాం. కానీ విపక్ష పార్టీ మాత్రం మీరు కొన్నే చేశారు కదా అని విమర్శిస్తోంది. జరిగిన అభివృద్ధి గురించి వాళ్లకు తెలిసి కూడా, తమపై బురద చల్లాలనే వ్యాఖ్యానిస్తుంటారు. స్కూళ్లకు వెళ్లే పిల్లల గురించి వాళ్ల తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆలోచించే వ్యక్తి జగన్. 

యూనిఫాంలు, బెల్టులు, బూట్లు, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు, టెక్ట్స్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు అన్నీ అందజేస్తున్నారు. యూనిఫాంలు కుట్టించేందుకు తల్లిదండ్రులకు డబ్బులు కూడా ఇస్తున్నాం. ఓ పిల్లవాడు కార్పొరేట్ విద్యార్థి తరహాలో యూనిఫాం, షూ వేసుకుని, బ్యాగ్ తగిలించుకుని వెళుతుండడం చూస్తుంటే సీఎం జగన్ సాధించాడని సంతోషం కలుగుతుంది. 

అయితే ఇది కొందరికి నచ్చడంలేదు. పేదవాళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోకూడదా? పేద విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోరాదని ఆటంకాలు సృష్టించే పార్టీ టీడీపీ. వాళ్లు చెయ్యరు, ఇతరులను చెయ్యనివ్వరు. చంద్రబాబు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రం మంచి గురించి ఆలోచన చేసిన వ్యక్తి కాదు" అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Gadikota Srikanth Reddy
English Medium
Govt Schools
YSRCP
CM Jagan
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News