శ్రీకాకుళం జిల్లాలో వింత చేప దర్శనం

New fish found in Srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో వింత చేప దొరికింది. నారాయణపురం కుడికాలువలో కొందరు రైతులు చేపలు పడుతుండగా, ఎంతో విచిత్రంగా ఉన్న ఈ చేప లభ్యమైంది. ఈ చేపను ప్రమాదకరమైనదిగా భావించిన గ్రామస్థులు దాన్ని చంపి భూమిలో పాతేశారు. నలుపు రంగు శరీరంపై తెల్లటి చారలతో ఉన్న ఈ చేపను తాము గతంలో ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ చేప మొప్పల వద్ద ఉన్న రెక్కలు చాలా బలంగా ఉన్నాయి. అది ఆ రెక్కల సాయంతో పైకిలేచే ప్రయత్నం చేయడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీనిపై రాజాం ఫిషరీస్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్ స్పందించారు. ఇది ప్రధానంగా క్యాట్ ఫిష్ జాతికి చెందినదని, దీన్ని అమెజాన్ సెయిల్ ఫిన్, బల్లి చేప అని కూడా అంటారని చెప్పారు.

ఈ చేపకు కింది భాగంలో నోరు ఉంటుందని, ఇది నీరు లేకుండా భూమిపైన కనీసం 15 నుంచి 30 రోజుల వరకు జీవించగలదని వివరించారు. ఈ తరహా చేపలు చెరువుల్లోకి ప్రవేశిస్తే చిన్న చేపలను తినేస్తాయని, ఇవి చెరువు యజమానులకు తీవ్రనష్టం కలిగిస్తాయని అన్నారు. ఇది విషపూరితమైన చేప అని, చంపేసి పూడ్చి వేయాలని సూచించారు. దీన్ని తినడం ప్రమాదకరం అని వెల్లడించారు.
Go Back to Shorts
Amazon Sailfin
Cat Fish
Narayana Puram Canal
Srikakulam District

More Telugu News