నెల్లూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు
- హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి
- భౌతికకాయం నెల్లూరుకు తరలింపు
- ప్రజల సందర్శనార్థం నెల్లూరు నివాసంలో భౌతికకాయం
- మేకపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ బృందం
టీడీపీ నేతల బృందం నేడు నెల్లూరులో గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించింది. నివాళులు అర్పించిన వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాగా, మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించనున్నారు. తన చిన్ననాటి మిత్రుడు, క్యాబినెట్ సహచరుడు అయిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్ కూడా హాజరవుతున్నారు.