కేసీఆర్ కొత్త నినాదం.. బంగారు భారత దేశం
- బంగారు తెలంగాణ మాదిరే బంగారు భారత దేశం
- నారాయణ్ ఖేడ్లో కేసీఆర్ సరికొత్త నినాదం
- సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన
- మోదీ సర్కారుపై విమర్శలు
జాతీయ రాజకీయాలపై అమితాసక్తి కనబరుస్తున్న కేసీఆర్.. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో ఓ కూటమి కట్టాలని యత్నిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలోనూ ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొన్ని రాష్ట్రాలు తిరిగిన కేసీఆర్.. దానిని ఎందుకనో గాని మధ్యలోనే ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పుడు కేసీఆర్ మరోమారు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించే దిశగా సాగుతున్న టీఆర్ఎస్తో భావ సారూప్యం కలిగిన పార్టీలతో చర్చల ప్రక్రియను కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం మహారాష్ట్ర రాజధాని ముంబై వెళ్లిన కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లతో చర్చించారు. త్వరలోనే మరిన్ని రాష్ట్రాలు చుట్టేయనున్న కేసీఆర్ ఆయా రాష్ట్రాల సీఎంలు, అక్కడి రాజకీయ పార్టీలతో చర్చలు జరపనున్నారు.
ఇలాంటి తరుణంలో నారాయణ్ ఖేడ్ పర్యటనలో భాగంగా కేసీఆర్ నోట నుంచి సంచలన కామెంట్లు వెలువడ్డాయి. బంగారు తెలంగాణ దిశగా కదిలిన మనం తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణగా మార్చుకున్నామని ఆయన చెప్పారు. అదే సమయంలో దేశాన్ని కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన కేసీఆర్.. బంగారు తెలంగాణ మాదిరే బంగారు భారత దేశమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మోదీ పాలనపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. దేశంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. మొత్తంగా సరికొత్తగా బంగారు భారత దేశం అంటూ కేసీఆర్ వినిపించిన ఈ కొత్త నినాదం జనానికి కొత్త ఊపునిచ్చిందనే చెప్పాలి.