సమ్మెలో రాజకీయ పార్టీలు చేరితే ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయి: సజ్జల
- ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె
- ఉద్యోగులకు పలు పార్టీల మద్దతు
- పరిస్థితి చేయిదాటుతుందన్న సజ్జల
- చర్చలే సమస్యలకు పరిష్కారం అని వ్యాఖ్య
- ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటన
ఉద్యోగుల ఉద్యమంలో రాజకీయ పార్టీలు కూడా చేరాయని, సమ్మెలో రాజకీయ పార్టీల చేరికతో ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. పరిస్థితి చేయి దాటుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఇచ్చిన అవకాశాలు వదులుకుంటున్నారని అసహనం వెలిబుచ్చారు. కొవిడ్ వేళ భారీ సామూహిక కార్యక్రమాలు సరికాదని సజ్జల హితవు పలికారు.
ఇక ఉద్యమ కార్యాచరణలోకి వెళుతుంటే ప్రభుత్వం బదిలీలు చేస్తోందన్న ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఉద్యోగులే బదిలీలు కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఆ ప్రక్రియను ఎందుకు ఆపుతుందని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చారని ప్రభుత్వం బదిలీలు ఆపుతుందా? అని అన్నారు. సమ్మెకు వెళుతున్న ఉద్యోగులు అత్యవసర సేవలు ఆపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు సహాయ నిరాకరణకు పాల్పడినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడం, గ్రామ సచివాలయాల ఏర్పాటు వల్లే ఆర్థికభారం పెరిగిందని సజ్జల వెల్లడించారు. ఉద్యోగుల డిమాండ్లు 70కి పైగా ఉన్నాయని, అవి ఎంతవరకు పరిష్కారానికి నోచుకుంటాయో తెలియదని సందేహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంపై స్పష్టత రావాలంటే చర్చలే మార్గమని తేల్చిచెప్పారు.