విజయవాడలో హైటెన్షన్.. వేలాది మంది ఉద్యోగులతో నిండిపోయిన బీఆర్టీ రోడ్డు.. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు!
- రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ చేరుకున్న వేలాది మంది ఉద్యోగులు
- పోలీసులను దాటుకుంటూనే ముందుకు సాగుతున్న ఉద్యోగులు
- బీఆర్టీ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత
ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళా ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటున్నారు. మరోవైపు నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారిని దాటుకుంటూనే ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. 'సీఎం డౌన్ డౌన్, నల్ల జీవోలు వెనక్కి తీసుకోవాలి, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, వీ వాంట్ జస్టిస్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి' అంటూ వారు నినదిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులతో బీఆర్టీ రోడ్డు కిక్కిరిసి పోయింది. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.