ఉద్యమ నాయకుడు కేసీఆర్ కు, సీఎం కేసీఆర్ కు చాలా తేడా ఉంది: బండి సంజయ్

Bandi Sanjay criticizes CM KCR on unemployment
  • నిరుద్యోగుల ఆత్మహత్యలపై బండి సంజయ్ స్పందన
  • కేసీఆర్ హామీలు నెరవేర్చడంలేదని ఆరోపణ
  • కోటి సంతకాల సేకరణ ప్రారంభం
నిరుద్యోగుల ఆత్మహత్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఉద్యమనాయకుడు కేసీఆర్ కు, సీఎం కేసీఆర్ కు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక అమలు చేయడంలేదని, తద్వారా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. లక్ష ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని 2014లో అసెంబ్లీలో కేసీఆర్ చెప్పలేదా? అని నిలదీశారు.

గత ఏడున్నరేళ్లుగా ఒక్క గ్రూప్-1 రిక్రూట్ మెంట్ లేదని, మూడేళ్లుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని బండి సంజయ్ ఆరోపించారు. ఇచ్చిన హామీలు విస్మరించడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, నిరుద్యోగుల ఆత్మహత్యలు ముఖ్యమంత్రి చేసిన హత్యలుగానే తాము భావిస్తామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెబుతోందని, నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి అమలు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగానే కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఉద్యోగాల భర్తీ కోసం తదుపరి అసెంబ్లీ సమావేశాల సమయంలో మిలియన్ మార్చ్ చేపడతామని వెల్లడించారు.
Go Back to Shorts
Bandi Sanjay
CM KCR
Unemployment
BJP
Telangana

More Telugu News